Monday 11 April 2022

ఈ భూమిలో యు.జి.పై రాసిన మొదటి ఆర్టికల్

 ఓ దశాబ్దం క్రితం యూజీ పుస్తకాలు పరిచయం అయినపుడు కలిగిన భావాలు ఇవి


                     పొనుగోటి కృష్ణారెడ్డి గారు ఎడిటర్ గా ఉన్న ‘ఈభూమి’ లో వచ్చిన అప్పటి ఆర్టికల్ ఇది

              ఆలోచింపజేసే యూజీ సంభాషణలు

            ఆయన ఏమీ బోధించరు. ఆయనకు అనుయాయులు లేరు. పబ్లిక్ టాక్ ఏమీ లేదు. వేదికలు లేవు. పుస్తకాలు.                   ఏమీ రాయలేదు. సాధన, శిక్షణ అంటూ ఏమీ చెప్పడు. ఒక సామాన్య మానవుడిలా జీవించాడు. అయినా తననొక ఆత్మజ్ఞానం పొందినవాడిలా భావిస్తూ అనేక దేశాల నుంచి అతని వద్జకు వచ్చి అతనితో ఎడతెగని సంభాషణలు జరిపేవారు.  శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, రచయితలు, విద్యావేత్తలు, జర్నలిస్టుల నుంచి సామాన్యుల వరకుఅనేక మంది తనపై పరంపరగా ప్రశ్నలు సంధించేవారు.తాను కేవలం ప్రశ్నల మూలాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించేవారు. 

                 ఈ క్రమంలో ప్రశ్నలే అదృశ్యమై వచ్చిన వారు దిగ్భ్రమకు లోనయ్యేవారు. తను మాత్రం ‘ నా జీవితం, నా మాటలు నీటిమీద రాతలు. మీ లాగా( సారీ మీరు కాదు) మర్యాద, మప్పితంగా మాట్లాడలేను’అంటారు. అయినా ఆయన మాటలు తూటాల్లా పేలాయి. ఆయన జీవితం సంచలనాత్మకం అయింది. ఆయన సంభాషణలు పుస్తకాలు, సీడీల రూపంలో ప్రపంచాన్ని చుట్టాయి. ‘మిస్టిక్ ఆఫ్ ఎన్ లైటెన్ మెంట్’ అనే పుస్తకం యురోపియన్ భాషలన్నింటిలోకి అనువాదమైంది. అనేక ముద్రణలకు నోచుకుంది.ఆ ప్రేరణతో ‘మైండ్ ఈజ్ మిత్’ అనే పుస్తకాన్ని పబ్లిషర్ ప్రచురించారు. ఇంకా ‘అదర్ సైడ్ ఆఫ్ ది ఫాక్ట్ , ‘ది కరేజ్ టు స్టాండ్ ఎలోన్’, థాట్ ఈజ్ యువర్ ఎనిమి’, ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ రాసిన ‘జీవిత చరిత్ర’ ... ఇలా అనేక పుస్తకాలు వచ్చాయి. 

                    ఇంతగా ప్రభావితం చేసిన ఆయన తెలుగు వాడంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. యూజీగా చిరపరిచితుడైన ఆయన పూర్తి పేరు ఉప్పలూరి గోపాలకృష్ణ.1918 జులై 19 న మచిలీపట్నం పట్నంలో జన్మించారు. తాత థియసాఫికల్ సొసైటీ ప్రపంచ కేంద్ర కార్యాలయం ఉన్న మద్రాస్ లోని అడయార్ లో బాల్యం, విద్యాభ్యాసం గడిచింది. సొసైటీ సారథులైన అనీబి సెంట్, జిడ్డు కృష్ణమూర్తి వారందరితో సాన్నిహితంగా మెలిగారు. అరుణాచలంలోని రమణ మహర్షిని ఒకే ఒకసారి కలిశారు. స్వామి శివానంద వద్ద ఏడు సంవత్సరాలు ప్రతి వేసవిలో హిమాలయాల్లో క్లసికల్ యోగా సాధన చేశారు. థియొసాఫికల్ సొసైటీ అధికార ప్రతినిధిగా ప్రపంచమంతా పర్యటించారు. 

               ఇలా అవిశ్రాంతంగా సాగుతున్న తన వెతుకులాటకు ఒక్కసారి బ్రేక్ పడింది. తాము చెబుతున్నదానికి, జీవితానికి ఏ మాత్రం సంబంధం లేదని థియొసాఫికల్ సొసైటీకి గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు తన 49వ ఏట తనలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తన స్థితిని ఆథ్యాత్మిక గురువులు చెప్పే ‘ఆత్మసాక్షాత్కారం, లేదా దివ్వ అనుభవంగా యూజీ చెప్పడు. దీనికి భిన్నంగా తన స్థితిని కాలుజారి పడటంగా చెబుతాడు. నా అనుభవం నీకు ఏ మాత్రం సాయపడదంటారు. తనలో వచ్చిన ఈ పెనుమార్పులపై యూజీ ఇలా అంటారు. ‘ ఆత్మజ్ఞానం ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్ని చోట్లా వెతికాను. కాని అన్వేషణ గురించి ప్రశ్నించలేకపోయాను. ఆత్మజ్ఞానం ఉందని ఊహించి దానిని అందుకోవాలనుకొన్నాను. ఈ అన్వేషణ నన్ను ఉక్కిబిక్కిరి చేసి, నా సహజస్థితి నుంచి నన్ను దూరం చేసింది. ఉనికిలో లేని దాని గురించి జీవితమంతా శోధించి చాలా పిచ్చి పని చేశాను. నా అన్వేషణ ముగిసింది. అని యుజి తనకు తాను భావిస్తాడు. ఇలా మలుపు తిరిగిన తన జీవిత ప్రస్థానం 2008 ఫిబ్రవరి 17లో మరణించే వరకు ఒక సంచలనంగా సాగుతుంది. తను మాత్రం గుర్తు పెట్టుకోదగిన వ్యక్తినే కాదని, అయి సామాన్యుడనని చెబుతారు

                  ‘యూజీ సంభాషణల్లో సైన్సు, మతం, రాజకీయాలు, తత్వశాస్త్రంలోని డొల్లతనాన్ని చెప్పడమే కాక నేరుగా మూలాల్లోకి వెళ్లి, ఎవరినీ ఒప్పించే ప్రయత్నం చేయకుండానే చాలా సాధరణంగా, నిష్కర్షగా, ముఖం మీద గుద్దినట్లు చెప్పడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది ‘ అంటారు ‘మైండ్ ఈజ్ మిత్’ సంపాదకుడు బెర్రీ న్యూలాండ్. 

            -నేనేమి చేయాలి. నీవు వస్తావు. నేను మాట్లాడతాను. నేను నిన్ను విమర్శించాలి.రాళ్లు వేయాలి. ఇదంతా నిష్ప్రయోజనం. నీ చుట్టూ దుర్భేద్యమైన కోటను నిర్మించుకున్నావు. నీవేమి చెదరవు. అనుభూతి చెందవు. నీ స్థితిని అర్థం చేసుకోవడం కష్టం. నీ చర్యలన్నీ నీ గతించిన జ్ఞాపకాల నుంచి సాగుతుంటాయి. ఈ క్షణంలో సంతోషం, అనుభూతుల గురించి మాట్లాడవు. నీ చర్యలను, భావోద్వేగాలను నిరంతరాయంగా విశ్లేషిస్తుంటావు. అదుపు చేస్తుటావు. ఇలా అనుభూతి చెందాను. అలా ఉండాలి అనుకుంటూ భవిష్యత్తులోని పారిపోతుంటావు. నీ సమస్యకు నీ భవిష్యత్తుకు సంబంధం ఉండదు. 

   -బయిటపడటం ఎందుకు సాధ్యపడడం లేదు. నిజంగా స్వార్థం నుంచి బయిటపడాలనుకుంటున్నావా?కానప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతావు. స్వార్థం లేని స్థితి, ప్రశాంతత అనేది చెప్పుకోవడానికే దాని విలువ.నేను చెప్పడం లేదు నీవు స్వార్థపరుడవని. దానికి వ్యతిరేకంగా నీవు అంటున్న స్వార్థరహిత స్థితి కూడా అర్థం లేనిదే. 

       - అర్థవంతమైన, ప్రయోజన పూర్వక సంబంధాల కోసం ఆసక్తి ప్రదర్శిస్తుంటాం. అందువల్ల వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. కాని అర్థం చేసుకోవడానికి వాస్తవం అంటూ ఏమీ లేదు.వాస్తవ ప్రపంచమంటూ ఉంటే అది సమాజం నన్ను నిర్దేశించిందే. వాస్తవ జగత్తును అర్థం చేసుకోవడమంటే అర్థం కోసమో, సహాయం కోసమో, ప్రయోజనం కోసమో కాకుండా ఉండాలి. 

      - మనమంతా జంతువులలాంటి వారమే.వ్యత్యాసం ఏమీ లేదు. దోమ మన రక్తాన్ని పోల్చడం కంటే మనమేమి పవిత్ర ఉద్ధేశం కోసం సృష్టి కాలేద

     - ప్రజలు నన్ను భౌతికవాది అంటారు.నాస్తికుడని కూడా అంటారు. ఎవరు ఎటువంటి ముద్రలు వేసినా వాటిపై నాకే ఆసక్తి లేదు. ఏ విషయంలోను నిన్ను ఒప్పించడానికి, లేదా నా మాటలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిచను. ప్రజలు వారికుండే సొంత కారణాల వల్ల నన్ను ఏదో చట్రంలో ఇమడ్చడానికి ప్రయత్నిస్తారు. నేను అతి సామాన్యుడనని చెప్పినా నన్ను ప్రత్యేకంగా చూస్తారు

       - ‘యుజి మాటలతో మన విశ్వాసాల పునాదులు కదిలిపోతాయి. దూసుకు వచ్చే అతని మాటల ప్రవాహానికి మూలం ఎక్కడని నీవు ఆశ్చర్యపోతావు’ అంటారు ‘థాట్ ఈజ్ యువర్ ఎనిమీ’ పుస్తకం ముందు మాటలో ఆంటోనీ పాల్ నోరోన్హా. 

            పోలిక సరైంది కాకపోయిన యూజీ సంభాషణలు వింటుంటే సోక్రటీస్, జపాన్ కు చెందిన పుకోఒకా, జిడ్డు కృష్ణమూర్తి తలంపునకు వస్తారు. మృత్యు ముంగిట్లో కూడా సోక్రటీస్ ఏథెన్స్ ప్రజల నుద్ధేశించి నిర్భీతిగా, నిజాయితీగా మాట్లాడిన తీరు యూజీ సంభాషణల్లో కనిపిస్తుంది. అలాగే జపాన్ కు చెందిన పుకోఒక వ్యవసాయ శాస్త్రవేత్తలతో భూమి స్వభావాన్ని గురించి చెబతున్నపుడు ఎంత అబ్బురపడతామో, మానవ స్వభావంపై యూజీ మాటలు కూడా అంతగా కదిలిస్తాయి. ఇక జిడ్డు కృష్ణమూర్తిని కృష్ణుడి అంశగానో, ఏసుక్రీస్తు అంశగానో భావించి పెంచి పెద్దచేసిన థియొసాఫికల్ సొసైటీ నుంచి జేకే బయటకు వచ్చే ముందు చేసిన ప్రసంగంలోని విజ్ఞత, తెగువ, నిజాయితీ యూజీలో కనిపిస్తుంది.

No comments:

Post a Comment